కలం, నిర్మల్: విదేశాల్లో స్థిరపడినా.. పుట్టిన ఊరిని మాత్రం మరువలేదు. తల్లిదండ్రుల జ్ఞాపకాలను గుండెల్లో పదిలంగా దాచుకుని.. స్వగ్రామ ప్రజలకు ఉపయోగపడేలా ఏదైనా చేయాలన్న సంకల్పంతో ముందుకు సాగారు. ఆ ఆలోచన నుంచి పుట్టిందే సుమారు రూ.కోటితో నిర్మించిన మోడల్ వైకుంఠధామం. సారంగాపూర్ మండలం జామ్ గ్రామానికి చెందిన ఏలేటి అజయ్ రెడ్డి స్వగ్రామంపై తనకున్న మమకారాన్ని సేవా రూపంలో చాటుకున్నారు.
తల్లిదండ్రుల జ్ఞాపకార్థం..
ఉద్యోగరీత్యా అమెరికాలో స్థిరపడిన అజయ్రెడ్డి తన స్వగ్రామంతో అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు. తల్లిదండ్రుల జ్ఞాపకార్థంగా గ్రామ ప్రజలకు చిరకాలం ఉపయోగపడే నిర్మాణం చేపట్టాలని నిర్ణయించుకొని గ్రామంలో ఆధునిక సౌకర్యాలతో కూడిన వైకుంఠధామాన్ని నిర్మించారు. సుమారు రూ.కోటి వ్యయంతో నిర్మించిన ఈ వైకుంఠధామం గ్రామ ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. మహిళలు, పురుషులకు ప్రత్యేకంగా స్నాన ఘట్టాలు, భక్తుల కోసం శివుని విగ్రహం, వచ్చే ప్రజలకు సౌకర్యంగా వెయిటింగ్ రూమ్ను నిర్మించారు.
పచ్చదనం, పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తూ వైకుంఠధామాన్ని మోడల్ గా తీర్చిదిద్దారు. బుధవారం వైకుంఠధామాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, గ్రామ సర్పంచ్ కరిపే రవళి విలాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. స్వగ్రామంపై అభిమానం, తల్లిదండ్రులపై ఉన్న ప్రేమను ప్రజా సేవగా మలచడం అభినందనీయమన్నారు.

