కలం, వెబ్ డెస్క్: దేశ అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటైన పద్మ అవార్డులు-2027 (Padma Awards 2027) కోసం కేంద్రం కీలక ప్రకటన చేసింది. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది. రిపబ్లిక్ డే-2027 సందర్భంగా ప్రకటించనున్న ఈ అవార్డుల కోసం నామినేషన్లు దాఖలు చేయడానికి 2026 జూలై 31 లాస్ట్ డేట్ అని అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్ (awards.gov.in) ద్వారా ఆన్లైన్లో నామినేషన్లు లేదా సిఫార్సులను స్వీకరించనున్నారు.
దేశవ్యాప్తంగా కళలు, సాహిత్యం, విద్య, క్రీడలు, వైద్యం, సామాజిక సేవ, సైన్స్, ఇంజనీరింగ్, ప్రజా వ్యవహారాలు, వాణిజ్యం వంటి వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందించిన వారిని కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డులతో (Padma Awards 2027) గౌరవించనుంది. ఈ పురస్కారాలు 1954లో ప్రారంభమయ్యాయి. పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అనే మూడు కేటగిరీలలో ప్రతి సంవత్సరం అవార్డులను అందించనున్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులను గుర్తించి అవార్డుకు నామినేట్ చేయాలని పౌరులను కేంద్ర ప్రభుత్వం కోరింది. ముఖ్యంగా మహిళలు, బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీలు, దివ్యాంగులు, సమాజానికి నిస్వార్థ సేవ చేస్తున్న వారిని గుర్తించి సిఫార్సు చేయాలని సూచించింది. పౌరులు తమకు తాముగా కూడా నామినేట్ చేసుకోవచ్చు.
Read Also: దేశంలో ఆయారాం.. గయారాం సంస్కృతి తెచ్చిందే కాంగ్రెస్: కేటీఆర్
Follow Us On: Facebook

