కలం, నిజామాబాద్ బ్యూరో : రైతుల ప్రయోజనార్ధం నిజామాబాద్ (Nizamabad) జిల్లాలో యాసంగి సీజన్ కు సంబంధించిన వరి ధాన్యం సేకరణ, పసుపు, మొక్కజొన్న కొనుగోళ్ల ప్రక్రియను నిశితంగా పర్యవేక్షించేందుకు వీలుగా జిల్లా (Nizamabad) స్థాయిలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ను కలెక్టర్ శుక్రవారం ప్రారంభించారు. ధాన్యం, మొక్కజొన్న, పసుపు విక్రయాలకు సంబంధించి ఏవైనా ఇబ్బందులు ఉంటే రైతులు కంట్రోల్ రూమ్ 08462-220183 నెంబర్ కు సంప్రదించి ఫిర్యాదులు, సలహాలు, సూచనలు అందించవచ్చని సూచించారు.
ప్రతి రోజు ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు కంట్రోల్ రూమ్ పని చేస్తుందని తెలిపారు. సంబంధిత శాఖల అధికారులు కంట్రోల్ రూమ్ లో అందుబాటులో ఉంటారని, రైతుల నుండి వచ్చే ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటారన్నారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. కాగా, వరి ధాన్యం అమ్మకాలకు సంబంధించి ఫిర్యాదుల స్వీకరణ కోసం రాష్ట్ర స్థాయిలో అందుబాటులో ఉన్న టోల్ ఫ్రీ నెంబర్ లు 1967కు లేదా 180042500333 కు రైతులు సంప్రదించవచ్చని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, డీఎస్ఓ శ్రీకాంత్ రెడ్డి, సివిల్ సప్లైస్ డీఎం ప్రవీణ్, ఏఎస్ఓ అరవింద్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

