కలం, ఖమ్మం బ్యూరో : ఖమ్మం (Khammam) జిల్లాలో వరుసగా గ్యాస్ సిలిండర్ (Gas Cylinder) దొంగతనాలు చోటుచేసుకుంటుండటం ప్రజలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. సాధారణంగా ఇళ్లలో చోరీలు జరిగితే బంగారం, నగదు వంటి విలువైన వస్తువులే లక్ష్యంగా ఉంటాయి. అయితే ఈసారి దొంగల దృష్టి గ్యాస్ సిలిండర్ల పై పడటం చర్చనీయాంశంగా మారింది. పెనుబల్లి మండలం లంకపల్లిలో మహమ్మద్ కమలుద్దీన్ ఇంట్లో వంటగదిలో ఉన్న గ్యాస్ సిలిండర్ను దొంగలు ఎత్తుకెళ్లిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. గ్యాస్ స్టౌ కనెక్షన్ను సైతం తొలగించి సిలిండర్ను తీసుకెళ్లడం ఆశ్చర్యానికి గురి చేసింది.
అలాగే భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా పాల్వంచ పట్టణంలోని ఒడ్డుగూడెం ప్రాంతంలో భూక్యా హిరణ్ గాంధీ ఇంటి బాల్కనీలో ఉంచిన సిలిండర్ కూడా మాయమైంది. విలువైన వస్తువులు ఏవి తీసుకెళ్లకుండా కేవలం గ్యాస్ సిలిండర్ (Gas Cylinder) మాత్రమే చోరీ కావడంతో బాధితులు షాక్కు గురయ్యారు. గ్యాస్ ఏజెన్సీలలో కృత్రిమ కొరత, బ్లాక్ మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయన్న ప్రచారంతో ఈ దొంగతనాలు చోటుచేసుకోవడం మరింత అనుమానాలకు దారితీస్తోంది. పోలీసులు క్లూస్ టీమ్తో కలిసి దర్యాప్తు ప్రారంభించారు. పాత నేరస్తులు, సిలిండర్ సరఫరా చేసే వ్యక్తుల కదలికలపై కూడా నిఘా పెట్టినట్లు సమాచారం. కాలనీల్లో అపరిచితులు కనిపిస్తే అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

