కలం, నిర్మల్: రేషన్ కార్డుదారులకు రేపటి నుండి మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీ (Ration Rice Supply) చేయనున్నారు. ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో ఆహార భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆగస్టు 1వ తేదీ నుంచి నిర్మల్ (Nirmal) జిల్లాలోని అన్ని రేషన్ దుకాణాల ద్వారా మూడు నెలల బియ్యం పంపిణీ ప్రారంభం కానుంది.
ఇందుకోసం అవసరమైన బియ్యం ఇప్పటికే రేషన్ దుకాణాలకు చేరుకుంది. నిర్మల్ జిల్లాలో మొత్తం 412 రేషన్ దుకాణాలు ఉండగా.. 2,49,606 రేషన్ కార్డులు ఉన్నాయి. వీటిలో 2,36,562 ఆహార భద్రత కార్డులు, 13,012 అంత్యోదయ కార్డులు, 32 అన్నపూర్ణ కార్డులు ఉన్నాయి. సాధారణంగా ప్రతి నెల 4,867 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ జరుగుతుండగా, ఈసారి మూడు నెలల కోటా ఒకేసారి అందుబాటులోకి రావడంతో బియ్యం నిల్వలను దుకాణాలకు తరలించారు.
బియ్యం పంపిణీకి అధికారులు రేషన్ దుకాణాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇదిలా ఉండగా రేషన్ కార్డులకు సంబంధించిన ఈ-కేవైసీ ప్రక్రియకు ప్రభుత్వం గడువు కూడా పొడిగించింది. ఇప్పటివరకు ఈ ప్రక్రియ పూర్తి చేయని కార్డుదారులు కొత్త గడువులోగా తమ సమీప రేషన్ దుకాణంలో బయోమెట్రిక్ ధ్రువీకరణ పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. మూడు నెలల రేషన్ ను ఒకేసారి పంపిణీ చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో జిల్లాలోని దాదాపు రెండున్నర లక్షల కుటుంబాలకు ఊరట లభించనుంది.

