కలం, నారాయణపేట : నారాయణపేట జిల్లా కృష్ణా మండలంలోని ముడుమల్ బృహత్ శిలా ఫలకాల (Mudumal Megalithic Menhirs) ప్రదేశాన్ని సంరక్షించేందుకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ (Narayanpet Collector) సీహెచ్ ప్రియాంక (Priyanka) అధికారులను ఆదేశించారు. ముడుమల్ నిలువురాళ్ల ప్రాంతానికి సంబంధించిన సర్వే నంబర్ల పరిధిలో ఉన్న మొత్తం ప్రభుత్వ భూమికి ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని కృష్ణా తహసీల్దార్ను ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్లోని కలెక్టర్ ఛాంబర్లో డెక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్ట్ చైర్మన్ వేద కుమార్, హెరిటేజ్ తెలంగాణ కార్యాలయ అసిస్టెంట్ డైరెక్టర్ నాగలక్ష్మి బృందం కలెక్టర్ ప్రియాంకను కలిశారు.
ఈ సందర్భంగా వేద కుమార్ మాట్లాడుతూ.. ముడుమల్ నిలువురాళ్లకు యునెస్కో గుర్తింపు కోసం ప్రపంచ వారసత్వ తాత్కాలిక జాబితాలో చోటు దక్కడం తెలంగాణకు గర్వకారణమని తెలిపారు. యునెస్కో శాశ్వత గుర్తింపు కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని, ఈ చారిత్రక ప్రాంతాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని కలెక్టర్కు వివరించారు. ఇప్పటికే ఇక్కడ పనిచేసిన కలెక్టర్లు నిలువురాళ్ల పరిరక్షణకు పలు చర్యలు చేపట్టారని తెలిపారు.
ముడుమల్ నిలువురాళ్ల ప్రాంతం గుండా వెళ్తున్న విద్యుత్ గ్రిడ్ లైన్ను తరలించే అంశంపై కూడా కలెక్టర్తో చర్చించారు. ఈ విషయంపై సంబంధిత అధికారులతో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ప్రియాంక వెల్లడించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను, డిప్యూటీ కలెక్టర్ ఫణికుమార్, విద్యుత్ శాఖ ఎస్ఈ నవీన్, డీఈఓ గోవిందరాజులు, ఆర్అండ్బీ ఈఈ వెంకటరమణ, సర్వే ల్యాండ్ ఏడీ వేణుగోపాల్, పీఆర్ ఈఈ అశోక్, డీపీఆర్వో రషీద్, హెరిటేజ్ విభాగం ఏఈ నరేష్, ముడుమల్ సర్పంచ్ బాల్రాజ్ తదితరులు పాల్గొన్నారు.

