కలం, మెదక్ బ్యూరో : కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టు (Kondapochamma Sagar project) భూ నిర్వాసితులు తమకు రావాల్సిన పరిహారం, పునరావాస (R&R) ప్యాకేజీల కోసం రోడ్డెక్కారు. ప్రాజెక్టు పూర్తై ఏళ్లు గడిచినా ప్రభుత్వం హామీ ఇచ్చిన ప్యాకేజీలు అందకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ సిద్దిపేట (Siddipet) జిల్లా ములుగు మండల కేంద్రంలోని రాజీవ్ రహదారిపై భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాసితులు మాట్లాడుతూ.. ప్రాజెక్టు నిర్మాణం కోసం తమ భూములు కోల్పోయి ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. ప్రభుత్వం ప్రకటించిన ఆర్అండ్ఆర్ ప్యాకేజీలు ఇప్పటికీ అందకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు.
భూములు కోల్పోవడంతో ఉపాధి లేకుండా పోయిందని, చేతిలో డబ్బులు లేక కుటుంబాలను పోషించడం భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు అధికారులను, ప్రజాప్రతినిధులను కలిసినా సమస్యకు పరిష్కారం లభించలేదని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమకు రావాల్సిన పరిహారం, పునరావాస ప్యాకేజీలను వెంటనే అందజేయాలని నిర్వాసితులు డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని హెచ్చరించారు.

