కలం, నల్లగొండ బ్యూరో : కృత్రిమ పానీయాలు మానేద్దాం.. సహజ పానీయాలు సేవిద్దామంటూ నల్లగొండ (Nalgonda) జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ (Chandrasekhar) పిలుపునిచ్చారు. యూటీఎఫ్ (తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్) నల్లగొండ జిల్లా కమిటీ, జ్ఞాన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో గడియారం సెంటర్ వద్ద నిర్వహించిన ఉగాది పచ్చడి పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు.
ప్రకృతిలో సహజంగా లభించే పానీయాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయని, కృత్రిమంగా తయారయ్యే పానీయాలు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయని తెలిపారు. “కృత్రిమ పానీయాలు మానేద్దాం – సహజ పానీయాలు సేవిద్దాం” అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన యూటీఎఫ్ జిల్లా కమిటీని ఆయన అభినందించారు.
నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ తొలి మేయర్ చైతన్య శ్రీనివాస్ రెడ్డి (Chaitanya Srinivas Reddy) మాట్లాడుతూ, తెలుగు నూతన సంవత్సరమైన ఉగాది ప్రాముఖ్యతను గుర్తుచేశారు. కాలానుగుణంగా శరీరానికి అవసరమైన పోషకాలు అందించే సహజ పానీయాలను తీసుకోవాలనే సందేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని అన్నారు.
ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం. రాజశేఖర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి పెరుమాళ్ళ వెంకటేశం, ఎఫ్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర కోశాధికారి ఎడ్ల సైదులు, జిల్లా కార్యదర్శులు గేర నరసింహ, మురలయ్య, నలపరాజు వెంకన్న, కొమర్రాజు సైదులు, మధుసూదన్, జన విజ్ఞాన వేదిక ప్రతినిధులు చంద్రశేఖర్, పి.డి. విమల, టాప్రా జిల్లా అధ్యక్షుడు శ్యాంసుందర్, అడ్వకేట్ శంకరయ్యతో పాటు వివిధ మండలాల బాధ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

