కలం, మెదక్ బ్యూరో: సిద్దిపేట (Siddipet) జిల్లా నర్మెట్టలో రైతు ఉత్సవాలను మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్తోపాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీశ్ రావు, కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎంపీ రఘునందన్ రావు కూడా హాజరయ్యారు. వ్యవసాయ, పశుసంవర్థక శాఖ, అనుబంధ రంగాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 150 స్టాల్స్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, మంత్రి పొన్నం ప్రభాకర్ రైతులనుద్దేశించి మాట్లాడారు.
సంప్రదాయ పంటలసాగుకు బదులు రాష్ట్ర రైతులు పామాయిల్ (Palm Oil Cultivation) సాగుచేయాలన్నారు. అకాల వర్షాలు, కోతుల బెడద లేకుండా మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న పామాయిల్ సాగు చేస్తే రైతులు జీవితాలు మారుతాయన్నారు. దేశవ్యాప్తంగా లక్ష కోట్ల విలువైన పామాయిల్ దిగుమతి చేసుకోవడంతో తీవ్రంగా నష్టపోతున్నామని, అందుకే కేంద్ర ప్రభుత్వం పామాయిల్ సాగును ప్రోత్సహిస్తుందన్నారు.
కరీంనగర్, సిద్దిపేట, జనగాం, మెదక్, భువనగిరి హనుమకొండ, వరంగల్ జిల్లాల రైతులకు అవగాహన అవసరమన్నారు. ఈ నెల 22న సీఎం రేవంత్ రెడ్డి నర్మేట పామాయిల్ ఫ్యాక్టరీ ప్రారంభిస్తారని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ తెలిపారు.

