నాగార్జునసాగర్‌లో ఘనంగా తొలి ఏకాదశి వేడుకలు.. పోటెత్తిన భక్తజనం

కలం, నాగార్జున సాగర్: నందికొండ మున్సిపాలిటీ (Nandikonda Municipality) పరిధిలోని నాగార్జునసాగర్‌ (Nagarjuna Sagar) లో ‘తొలి ఏకాదశి’ (Tholi Ekadashi) పర్వదినాన్ని భక్తులు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సంవత్సరం తొలి ఏకాదశి శనివారం రావడంతో సాగర్ చుట్టుపక్కల గ్రామాల నుండి ప్రజలు అధిక సంఖ్యలో సాగర్‌కు చేరుకొని కృష్ణా నదిలో పుణ్య స్నానాలు ఆచరించి దేవాలయాలలో పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా సాగర్‌లోని కృష్ణా నది తీరాన ఉన్న దేవాలయాలు చుట్టుపక్కల ప్రాంతాల నుండి వచ్చిన భక్తులతో కిటకిటలాడాయి. అధిక సంఖ్యలో భక్తులు రావడంతో సాగర్‌లో వాహనాల రద్దీ పెరగింది. దీంతో సాగర్ పోలీసులు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. హిల్ కాలనీలోని రమా సహిత సత్యనారాయణ స్వామి దేవాలయంలో తొలి ఏకాదశి సందర్భంగా 300 మందికి పైగా దంపతులు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలలో పాల్గొన్నారు.

భక్తుల సౌకర్యార్థం దేవాలయంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వాహకులు ఏర్పాటు చేశారు. తొలి ఏకాదశి సందర్భంగా రమా సహిత సత్యనారాయణ స్వామి దేవాలయంలో ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ మంచికంటి కిషోర్ బాబు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించగా స్థానిక ఎస్ఐ సతీష్ ముఖ్య అతిథిగా హాజరైనారు. నాగార్జునసాగర్ (Nagarjuna Sagar) జలాశయంలో నీటిమట్టం తక్కువగా ఉండడంతో భక్తులు స్నానాలు చేయడానికి తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

కృష్ణా నది తీరాన నదిలో లోతైన ప్రాంతంలో భక్తులు స్నానాలకు వెళ్లకుండా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సాగర్ పోలీసులు బందోబస్తు చర్యలను నిర్వహించారు. ఏకాదశి సందర్భంగా అధిక సంఖ్యలో చుట్టుపక్కల ప్రాంతాల నుండి ప్రజలు సాగర్‌కి రావడంతో సాగర్‌లోని పర్యాటక ప్రాంతాలైన బుద్ధవనం, లాంచి స్టేషన్, ప్రధాన జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం, కొత్త బ్రిడ్జి వద్ద సందడి నెలకొంది.

Read Also: ముచ్చ‌ట‌గా మూడోసారి.. సీజేపీతో ముగిసిన చ‌ర్చ‌లు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>