కలం, వెబ్ డెస్క్ : నాగాలాండ్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి విషాదం (Nagaland Landslide) చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందడంతో పాటు పలువురు గల్లంతైనట్లు అధికారులు ప్రకటించారు.
ప్రమాదం అనంతరం సహాయక బృందాలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
భారీ వర్షాల కారణంగా కొండ ప్రాంతాల్లో ప్రమాద పరిస్థితులు నెలకొన్నాయని అధికారులు హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరం అయితే తప్ప కొండ ప్రాంతాల్లో ప్రయాణాలు చేయవద్దని సూచించారు.

