కలం, నిర్మల్ : జీపు బోల్తాపడి కుబీర్ మండలం పార్డి (బి) గ్రామానికి చెందిన నలుగురు మృతి చెందడంతో పాటు ఏడుగురు తీవ్రంగా గాయపడిన ఘటనపై ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ (Mudhole MLA Pawar Ramarao Patel) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సోమవారం బైంసా పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలోని పోస్టుమార్టం గదికి వెళ్లి మృతదేహాలను పరిశీలించారు.
ప్రమాదానికి సంబంధించిన వివరాలను అధికారులను, కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పరామర్శించి ఓదార్చారు. ఒకే గ్రామానికి చెందిన నలుగురు మృతి చెందడం అత్యంత దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు దేవుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు.
అనంతరం బైంసాలోని డాక్టర్ ప్రీతం ఆసుపత్రి, జీడీఆర్ హాస్పిటల్, వెంకటేశ్వర హాస్పిటల్కు వెళ్లి ప్రమాదంలో గాయపడిన బాధితులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు అవసరమైన మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని వైద్యులకు సూచించారు. బాధితులకు ప్రభుత్వం, అధికార యంత్రాంగం అండగా ఉంటుందని భరోసా కల్పించారు.

