కలం, నకిరేకల్ : అనారోగ్యంతో బాధపడుతున్న నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) కొండంత భరోసానిస్తోందని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే (Nakrekal MLA) వేముల వీరేశం (Vemula Veeresham) పేర్కొన్నారు. నకిరేకల్ మండలం కడపర్తి గ్రామానికి చెందిన బట్టు నరహరి తీవ్ర అనారోగ్యంతో హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితుడి వైద్య ఖర్చుల నిమిత్తం ప్రభుత్వం నుంచి మంజూరైన రూ.3.50 లక్షల విలువైన ఎల్ఓసీ పత్రాన్ని మంగళవారం ఆయన కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే స్వయంగా అందజేశారు.
ఆపదలో అర్హులకు అండగా ప్రభుత్వం
ఈ సందర్భంగా వేముల వీరేశం మాట్లాడుతూ… ఆపద కాలంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సహాయాన్ని త్వరితగతిన అందించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. వర్తమాన ప్రజా ప్రభుత్వం పేదల సంక్షేమానికి, ఆరోగ్య భద్రతకు అత్యధిక ప్రాధాన్యమిస్తోందని పేర్కొన్నారు. కష్టకాలంలో రూ.3.50 లక్షల ఆర్థిక సాయం అందేలా చొరవ చూపిన ఎమ్మెల్యే వేముల వీరేశంకి బాధితుడి కుటుంబ సభ్యులు ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

