కలం, ఖానాపూర్: సామాజిక వివక్షకు గురవుతున్న ట్రాన్స్జెండర్లకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించే దిశగా మున్సిపాలిటీల చట్ట సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలపడం హర్షణీయమని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ (Vedma Bojju Patel) అన్నారు. అసెంబ్లీలో బిల్లుపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. రోజురోజుకూ ట్రాన్స్జెండర్ల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో వారికి ప్రత్యేక గుర్తింపు కార్డులు అందించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలించాలని కోరారు.
మున్సిపల్ కార్పొరేషన్లలో కో–ఆప్షన్ సభ్యులుగా అవకాశం కల్పించిన తరహాలోనే మండల పరిషత్లలోనూ ట్రాన్స్జెండర్లకు కో ఆప్షన్ సభ్యులుగా అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని వెడ్మ బొజ్జు పటేల్ కోరారు. వారికి రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలన్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆలోచన అభినందనీయమన్నారు. ఈ నిర్ణయం తీసుకున్న సీఎం, మంత్రివర్గానికి సెల్యూట్ చేస్తున్నానని బొజ్జు పటేల్ అన్నారు.

