కలం, వెబ్ డెస్క్: మూసీ (Musi) ప్రక్షాళన ప్రారంభమైందే బీఆర్ఎస్ హయాంలో అని ఆ పార్టీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి (MLA Sudheer Reddy) వ్యాఖ్యానించారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మూసీపై జరిగిన చర్చలో సుధీర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మూసీ ప్రాజెక్టుకు బీఆర్ఎస్ (BRS) వ్యతిరేకం కాదని సుధీర్ రెడ్డి స్పష్టం చేశారు. బీఆర్ఎస్ హయాంలో మూడు దశల్లో మూసీ ప్రక్షాళన చేసేందుకు నిర్ణయించినట్లు చెప్పారు. ఆనాడే 31 ఎస్టీపీలతో నీటి శుద్ధి ప్రోగ్రామ్ చేపట్టినట్లు తెలిపారు.
11 వేల నిర్మాణాలను ఆనాడే గుర్తించామని, కానీ ఒక్క ఇంటిని కూడా కూల్చలేదని సుధీర్ రెడ్డి తెలిపారు. ఈ ప్రభుత్వం పేదలపై కక్ష కట్టినట్టు వ్యవహరిస్తుందని విమర్శించారు. రెడ్ మార్కులు పెట్టి ఇళ్లను కూలగొడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు నష్టం జరగకుండా అభివృద్ధి పనులు చేపట్టాలని కోరారు. శుభ్రమైన నీటినే మూసీలోకి వదలాలని సుధీర్ రెడ్డి డిమాండ్ చేశారు. కాలుష్య కారకాలను తొలగించాలని కోరారు. నిరంతరం మూసీలో పరి శుభ్రమైన నీరు ప్రవహించేలా చేయాలన్నారు. ఈస్ట్, వెస్ట్ను లింకు చేసేలా ఆనాడు ప్లాన్ చేసినట్లు తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన పనులను కాంగ్రెస్ ప్రభుత్వం నత్త నడకన నడిపిస్తుందని విమర్శించారు.

