కలం, దేవరకొండ : విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతూ ఉపాధ్యాయులు అందిస్తున్న సేవలు సమాజానికి ఎంతో ఆదర్శప్రాయమని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ (Balu Naik) అన్నారు. స్థానిక దేవరకొండ జిల్లా పరిషత్ (బాలుర) ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా సుదీర్ఘ సేవలు అందించి పదవీ విరమణ పొందిన చేరిపల్లి శ్రీనివాసులు సన్మాన కార్యక్రమం శుక్రవారం ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ (Balu Naik), హెచ్ఎం శ్రీనివాసులుని ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. “ఉపాధ్యాయ వృత్తి అనేది కేవలం సాధారణ ఉద్యోగం మాత్రమే కాదు, అది భావితరాలను నవ సమాజంగా నిర్మించే ఒక గొప్ప బాధ్యత.” అని చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వ విద్యా రంగానికి పెద్దపీట వేస్తోందని తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి, విద్యా ప్రమాణాల పెంపునకు, ఉపాధ్యాయుల సంక్షేమానికి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని పేర్కొన్నారు. దేవరకొండ జెడ్పీహెచ్ఎస్ (బాలుర) పాఠశాలలో అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు తన వంతు సంపూర్ణ సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.
ఈ వేడుకలో పట్టణ మున్సిపల్ చైర్మన్ పున్న శైలజ-వెంకటేశ్వర్లు, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహా, దేవరకొండ చేనేత సహకార సంఘం అధ్యక్షులు చేరిపల్లి బాలరాజులతో పాటు పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
Read Also: అందుకే మాట్లాడలేదు.. ‘నీట్’ లీక్ పై రాఘవ్ చద్దా స్పందన
Follow Us On : WhatsApp

