మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రిని సందర్శించిన ఎమ్మెల్యే బత్తుల

కలం, మిర్యాలగూడ : ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (Miryalaguda MLA Bathula Laxma Reddy) శనివారం మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో జన్మించిన మిర్యాలగూడ పట్టణ 37వ వార్డు కాంగ్రెస్ నాయకులు గుంజా శ్రీనివాస్ మనవరాలిని ఎమ్మెల్యే పరామర్శించి, చిన్నారికి తన ఆశీస్సులు అందజేశారు. అనంతరం కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలుపుతూ, తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే ఆసుపత్రిలోని వివిధ వార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు.

చికిత్స పొందుతున్న రోగులను కలిసి వారి ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీశారు. ముఖ్యంగా ప్రసవించిన బాలింతలతో మాట్లాడి ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, కల్పిస్తున్న సౌకర్యాలు, వైద్య సిబ్బంది ప్రవర్తన మరియు పనితీరు గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న నాణ్యమైన వైద్య సేవలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. అనంతరం డ్యూటీలో ఉన్న వైద్యులు, ఉన్నతాధికారులతో ఎమ్మెల్యే బత్తుల ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

ఆసుపత్రికి రోజువారీగా వచ్చే ఓపీ రోగుల వివరాలు, ప్రతిరోజు జరుగుతున్న ప్రసవాల సంఖ్య, మందుల లభ్యత, అందుబాటులో ఉన్న మౌలిక వసతులు, ఆసుపత్రికి తక్షణమే కావాల్సిన అదనపు వసతులపై సమగ్రంగా చర్చించారు. “ప్రజారోగ్య పరిరక్షణే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నాణ్యమైన వైద్య సేవలు అందించాలి. ప్రతి రోగికి సకాలంలో వైద్యం అందేలా సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఆసుపత్రిలో సేవల మెరుగుదలకు ప్రభుత్వం తరపున అన్ని రకాల చర్యలు తీసుకుంటాం.” అని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ చిలుకూరి సుధా బాలకృష్ణ, వైస్ చైర్మన్ గుడిపాటి శిరీష నవీన్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డిలతో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>