కలం, ఖమ్మం బ్యూరో: ప్రతి రైతుకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Thummala Nageswara Rao) అన్నారు. మంగళవారం ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలోని పులిగుండాల (Puligundala) ప్రాజెక్టు నీటి విడుదలకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. పెనుబల్లి మండలంలోని పులిగుండాల ప్రాజెక్టు పరిధిలోని బ్రహ్మలకుంట గ్రామంతోపాటు పరిసర ప్రాంతాల్లో పంటలు ఎండిపోతున్నాయనే రైతుల ఆవేదనపై ఆయన స్పందించారు. ప్రాజెక్టు సాగునీటి విడుదలలో ఉన్న అడ్డంకులను వెంటనే తొలగించి సుమారు 1000 ఎకరాలకు నీరు అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మంత్రి ప్రాజెక్టు పరిస్థితులపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ, ఫారెస్ట్ శాఖల సమన్వయంతో వాటిని అత్యవసరంగా పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, డీఎఫ్ఓ సిద్ధార్థతో మంత్రి ఫోన్లో మాట్లాడి ఏమైనా ఇబ్బందులు ఉంటే పరిష్కరించాలని సూచించారు. యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టి నీటి విడుదలను వేగవంతం చేయాలని నీటిపారుదల శాఖ అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. రైతుల పంటలు ఎండిపోకుండా కాపాడటం ప్రభుత్వ ప్రాధాన్యత అని తుమ్మల అన్నారు.

