కలం, ఖమ్మం బ్యూరో: ప్రశాంత, పచ్చని, ప్రగతిశీల నగరంగా ఖమ్మం (Khammam) రూపకల్పనకు అన్ని చర్యలు చేపట్టనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళీ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Thummala) అన్నారు. మంగళవారం స్థానిక 36వ డివిజన్ లో 63 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న రజక భవన నిర్మాణ పనులకు శంఖుస్థాపన, రూ. 2.43 కోట్ల వ్యయంతో నిర్మించిన పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనానికి ప్రారంభోత్సవం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో అన్ని మౌళిక సదుపాయాలు కల్పించనున్నట్లు తెలిపారు. పట్టణ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో డాక్టర్స్, సిబ్బందిని పెంచి, 12 గంటలు వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజారోగ్యం కోసం పట్టణ పీ.హెచ్.సీ (PHC) లు ఏర్పాటు చేశామని అన్నారు. పట్టణ పి.హెచ్.సిలతో జిల్లా కేంద్ర ఆసుపత్రికి లోడ్ తగ్గుతుందని అన్నారు. ఆరోగ్య కేంద్ర సేవలు పూర్తి స్థాయిలో వినియోగించుకుంటే మధ్య తరగతి, పేద వారికి ఉపయోగం కలుగుతుందని అన్నారు.
కోట్ల రూపాయలు ఉన్నా రహదారులు ఇరుకుగా ఉంటే ఏమి ఉపయోగం లేదని, జనాభాకు తగ్గట్టు రహదారుల విస్తరణ చేస్తే, వ్యాపారం బాగా ఉంటుందని, విలువ పెరుగుతుందని, నగరం అందంగా తయారవుతుందని తెలిపారు. రోడ్ల విస్తరణతోనే మీ ఆస్తులకు విలువ.. ట్రాఫిక్ ఇబ్బందులు ఉండవని మంత్రి అన్నారు. కస్బా బజార్ విస్తరణతో బ్రాండెడ్ షోరూమ్ లు వచ్చాయని తెలిపారు. చుట్టుపక్కల జిల్లాల వారు ఖమ్మంలో నివసించేలా మౌళిక సదుపాయాల కల్పన చేయాలని అన్నారు. రోడ్ల విస్తరణలో ఇల్లు కోల్పోయిన వారికి అన్ని విధాలా న్యాయం చేస్తామని అన్నారు. ఖమ్మం నగరంలో అన్ని కులాలు, వర్గాల వారికి సామరస్య జీవనం ఉండేలా ఖమ్మం నగరాభివృద్ధి చేస్తామని మంత్రి (Minister Thummala) తెలిపారు.
Read Also: యాసిడ్ దాడి నిందితుల ఆస్తుల జప్తు.. బాధితులకు పరిహారం: సుప్రీంకోర్టు
Follow Us On: Instagram


