కలం, వెబ్ డెస్క్ : మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ (MLA Kavvampally Satyanarayana) ఎస్సీ నియోజక వర్గాల స్థితిగతులపై కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలోని ఎస్సీ నియోజకవర్గాలు అణచివేతకు గురవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అన్యాయం జరుగుతున్న తీరుపై ఇక ఊరుకునే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు.
కేవలం మందుల సామేల్ కే అవమానం జరగలేదని, ఎస్సీ నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు, ప్రజల ఆత్మగౌరవానికే దెబ్బ తగిలేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఎస్సీ నియోజకవర్గాల అభివృద్ధి, ప్రజల హక్కులు, ప్రజాప్రతినిధుల గౌరవానికి భంగం కలిగించే చర్యలను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
ఇకపై ఎస్సీ నియోజకవర్గాలపై జరుగుతున్న వివక్ష, నిర్లక్ష్యంపై మౌనంగా ఉండబోమని, అదనంగా ఎస్సీ నియోజకవర్గాలకు వెయ్యి ఇండ్లు కేటాయించాలని, ఈ విషయంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు విజ్ఞప్తి చేశామన్నారు. కాగా, తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుల నియామకంపై వివాదం కొనసాగుతోంది. ఈ విషయంలో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ వర్సెస్ కొమటి రెడ్డి బ్రదర్స్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈ క్రమంలో కవ్వంపల్లి సత్యనారాయణ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

