కలం, వెబ్ డెస్క్: ఆషాడ బోనాల ఉత్సవాల్లో భాగంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ (Minister Konda Surekha) మారు బోనం సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రికి దేవాదాయ శాఖ డైరక్టర్ హనుమంతరావు, అసిస్టెంట్ కమిషనర్ మనోహర్ రెడ్డి, అర్చకులు డప్పు చప్పుళ్ళు, శివసత్తుల పూనకాల మధ్య స్వాగతం పలికారు. బోనం ఎత్తుకోని అమ్మవారి సన్నిధానానికి చేరుకొని ప్రత్యేక పూజలు చేసి మారు బోనం సమర్పించారు. ఆలయ ప్రధానార్చకులు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో (Secunderabad Bonalu) మంత్రి సురేఖబోనమెత్తిన మహిళలకు ఈ సందర్భంగా మంత్రి సురేఖ చీరె, సారె అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ.. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి మారుబోనం సమర్పించడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. అమ్మవారికి సమర్పించిన బియ్యంతో మారు బోనం చేయడం తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల్లో విశిష్టమైన ఆచారమని పేర్కొన్నారు. అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఆషాడ బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించుకోవడం మనందరికీ గర్వకారణమన్నారు.

