కలం, నల్లగొండ: తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు పూర్తి చేసుకుని, 13వ సంవత్సరంలో అడుగుపెడుతున్న శుభ సందర్భాన్ని పురస్కరించుకుని నల్లగొండ (Nalgonda) లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు మంత్రి (Minister) కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జాతీయ జెండాను ఆవిష్కరించి జిల్లా ప్రజలకు అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఎందరో అమరవీరుల త్యాగఫలితంగా 4 కోట్ల మంది ప్రజల 60 ఏళ్ల ప్రత్యేక రాష్ట్ర కల సాకారమైందని ఆయన స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. నల్లగొండ జిల్లా విప్లవాల పురిటిగడ్డ అని, సాయుధ పోరాటం నుండి మలిదశ ఉద్యమం వరకు ఈ గడ్డ సింహభాగం పాత్ర పోషించిందని కొనియాడారు. నాడు ప్రజల ఆకాంక్ష కోసం తన మంత్రి పదవిని సైతం తృణప్రాయంగా విసిరికొట్టి, ఆమరణ నిరాహార దీక్షకు దిగిన చరిత్ర తనదని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రగతి పథంలో దూసుకుపోతోందని, నల్లగొండ జిల్లాను అభివృద్ధి, సంక్షేమంలో అగ్రభాగాన నిలబెట్టే బాధ్యత తనదని ఆయన స్పష్టం చేశారు.
రాష్ట్రంలో మార్చి 6వ తేదీ నుండి జూన్ 12వ తేదీ వరకు 99 రోజుల పాటు జరుగుతున్న “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికా” కార్యక్రమంలో భాగంగా జిల్లాలో సాధించిన వివిధ శాఖల ప్రగతి వివరాలను మంత్రి వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీలు నెల్లికంటి సత్యం, శంకర్ నాయక్, నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి, జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్, ఎస్పీ శరత్ చంద్ర పవార్, అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, ఆర్డీవో వై. అశోక్ రెడ్డి, డిప్యూటీ మేయర్ అష్రఫ్ అలీ, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, స్థానిక కార్పొరేటర్ కవిత, జిల్లా అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు, సిబ్బంది తదితరులు హాజరయ్యారు.

