కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్ నాంపల్లి కోర్టులో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ (AICC) వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan) కేసుకు సంబంధించిన పిటిషన్ పై కీలక పరిణామం చోటు చేసుకుంది. తార్నాకకు చెందిన మాజీ కార్పొరేటర్ శ్రీలత దాఖలు చేసిన పిటిషన్ ను నాంపల్లి కోర్టు రిటర్న్ చేసింది. ఈ మేరకు పిటిషన్ తమ పరిధిలోకి రాదన్న నాంపల్లి కోర్టు.. ప్రజాప్రతినిధుల కోర్టులో పిటిషన్ వేయాలని సూచించింది. మీనాక్షి నటరాజన్ ఈ కేసు విషయంపై ప్రజా ప్రతినిధుల కోర్టును ఆశ్రయించాలని చెప్పింది.
కాగా, తనపై వేధింపులకు పాల్పడ్డ నారాయణపేట కాంగ్రెస్ నాయకుడు కుంభం శివకుమార్ రెడ్డిపై కాంగ్రెస్ హైకమండ్ చర్యలు తీసుకోలేదని మాజీ కార్పొరేటర్ శ్రీలత గతేడాది ఆగస్టు 20న నాంపల్లిలోని 4వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో ప్రైవేటు పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో ప్రతివాదులుగా కుంభం శివకుమార్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌత్ తో పాటు మీనాక్షి నటరాజన్ పేరు ను కూడా చేర్చారు. ఇదే కేసు విషయమై మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణకు గురైంది. ఆమె క్రిమినల్ కేసు దాచిపెట్టారని ఆరోపిస్తూ ఎన్నికల అధికారి నామినేషన్ తిరస్కరించడం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. తెలంగాణలో అసలు క్రిమినల్ కేసే లేదని, కేవలం కోర్టు నోటీసు మాత్రమే ఉందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. బీజేపీ అనైతిక చర్యలకు పాల్పడుతుందని మండిపడుతోంది.

