కలం మెదక్ బ్యూరో: వేసవి సెలవుల తర్వాత సరికొత్త ఆశలతో బడి గడప తొక్కిన విద్యార్థులకు మెదక్ (Medak) జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల అపురూప స్వాగతం పలికింది. పాపన్న పేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల పునఃప్రారంభం సందర్భంగా పాఠశాల యాజమాన్యం విద్యార్థులకు గులాబీలతో స్వాగతం పలికింది. పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేసి బడిలోకి ఆహ్వానించారు. మండల విద్యాధికారి ప్రతాపరెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు మహేశ్వర్ విద్యార్థులకు (Students) వెల్కం చెప్పారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ అత్యుత్తమ ఉపాధ్యాయులు కేవలం ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉంటారని, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందన్నారు. అందుకే తల్లిదండ్రులు ప్రైవేట్ బదులు ప్రభుత్వ పాఠశాలలకు పంపించాలని కోరారు.

