కలం, మెదక్ బ్యూరో : మెదక్ జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ రైస్ (Medak CMR Scam) ధాన్యం సేకరణ ప్రక్రియలో చోటుచేసుకుంటున్న అక్రమాలు కలకలం రేపుతున్నాయి.సివిల్ సప్లైస్ విజిలెన్స్ ,ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు జరిపిన ఆకస్మిక తనిఖీల్లో పలువురు మిల్లర్ల మాయాజాలం బయట పడుతున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా మిల్లర్లు ప్రభుత్వానికి దాదాపు 180 కోట్ల విలువైన సీఎంఆర్ బకాయిలు ఉన్నట్లు సమాచారం. తరుగు నుండి మొదలు రికార్డుల అవకతవకల వరకు పలు రూపాల్లో రైస్ మిల్లర్ల అక్రమాలు బయటకు వస్తున్నాయి.
వేలాది వడ్ల బస్తాల్లో వరిపొట్టు
అక్రమాలు చేయడానికి మిల్లర్లు కొత్త కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. తాజాగా తూప్రాన్ మండలం మల్కాపూర్ గ్రామంలోని సాయి బాలాజీ రైస్ మిల్లులో సివిల్ సప్లైస్ ,విజిలెన్స్ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. యజమాని కోట్లాది రూపాయల విలువైన ధాన్యాన్ని పక్కదారి పట్టించి, అధికారులను బురిడీ కొట్టించేందుకు బస్తాలలో ధాన్యానికి బదులుగా వరిపొట్టు (ఊక) నింపాడు. తనిఖీల సందర్బంగా అనుమానం వచ్చిన అధికారులు.. మిల్లులో నిల్వ ఉంచిన బస్తాలను తెరిచి ..నోర్లు వెళ్లబెట్టారు.
బస్తాల్లో వరి ధాన్యం బదులుగా వరి పొట్టు ఊక నింపిపెట్టారు. దాదాపు 10,000 ధాన్యం బస్తాలు మాయమైనట్లు అధికారులు గుర్తించారు. 2022-23 టెండర్ ధాన్యం 8268 బస్తాలు, 2025-26 ఖరీఫ్ ధాన్యం 2156 బస్తాలు తక్కువగా ఉన్నట్టు గుర్తించారు. పదివేలకు పైగా వడ్ల బస్తాల బదులుగా పొట్టు నింపారు. తనీఖీలు నిర్వహించిన అధికారులు బస్తాల్లో ధాన్యం ఏదని ప్రశ్నించగా, “ఎలుకలు ధాన్యాన్ని తినేయడం వల్లే కేవలం పొట్టు మాత్రమే మిగిలింది” అని మిల్లు యజమాని సమాధానమివ్వడంతో అధికారులు అవాక్కయ్యారు. భారీ స్ధాయిలో కోట్లాది రుపాయల అక్రమాలకు పాల్పడిన సాయి బాలాజీ రైస్ మిల్లును వెంటనే సీజ్ చేసి, క్రిమినల్ కేసు నమోదు చేసి పూర్తిస్థాయి విచారణ చేపట్టారు.
7.17 కోట్ల ధాన్యం మాయం
రెండు నెలల క్రితంజూలై నెలలో కొల్చారంలోని ‘సత్యసాయి ఆగ్రో రైస్ మిల్ ఇండస్ట్రీస్’లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ మరియు పౌర సరఫరాల శాఖ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో భారీ అక్రమాలు వెలుగుచూశాయి. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం… 2025-26 ఖరీఫ్ సీజన్కు సంబంధించి మిల్లులోని ధాన్యం నిల్వలను తనిఖీ చేయగా, సుమారు 3,027 మెట్రిక్ టన్నుల ధాన్యం తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. మార్కెట్ విలువ ప్రకారం మాయమైన ఈ ధాన్యం విలువ దాదాపు 7.17 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ధాన్యం నిల్వల్లో వ్యత్యాసాలు మరియు అక్రమాలు నిర్ధారణ కావడంతో, రైస్ మిల్ యజమాని డి. శ్రీనివాస్పై అధికారులు కేసు నమోదు చేశారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాల నుండి సేకరణ సందర్భంగా తరుగు ,తేమ శాతం, మిల్లింగ్ చార్జీలు, ఓటీఅర్ ,సాంకేతిక ,రికార్డుల్లో అవకతవకలు ..ఇలా పలు రకాలుగా అవకాశం ఉన్న దగ్గర కొందరు అక్రమాలు చేస్తున్నారు. ప్రభుత్వ ధాన్యాన్ని పక్కదోవ పట్టించి, అక్రమాలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా తనిఖీల్లో పాల్గొన్న అధికారులు హెచ్చరించిన మిల్లర్ల వైఖరీ మాత్రం మారడంలేదు. ప్రభుత్వ నిబంధనలను పాటించని రైస్ మిల్లులను ధాన్యం సేకరణ మరియు కస్టమ్ మిల్లింగ్ ప్రక్రియల చేపట్టకుండా , బ్లాక్లిస్ట్లో పెడుతున్నరు .మరోవైపు క్షేత్రస్ధాయిలో కొందరు అధికారులు చూసి చూడనట్లు వదిలేయడం , అక్రమాల్లో వాటా తీసుకొవడంతో.. విజులెన్స్ ,ఎన్ ఫోర్స్ మెంట్ అధికారుల తనిఖీల సందర్బంగా కోట్లాది రుపాయల అవకతవకలు బయటపడుతున్నాయి.
అక్రమాలే కాకుండా ప్రభుత్వం చెల్లించవలసిన బకాయిలు విషయంలోనూ మిల్లర్లు మొండికేస్తున్నారు. రబీ 2022 -23 సంవత్సరం సంబంధించి ప్రభుత్వ సబ్ కమిటీ నిర్ణయించిన ప్రకారం మెదక్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 180 కోట్లు రికవరీ కావల్సి ఉండగా ..ఇప్పటికి వరకు 80 కోట్లు రికవరీ చేశారు ..మిగిలిన వంద కోట్లు రికవరీ చేయల్సి ఉంది. అయితే ఈ వంద కోట్లులో కుడా 50 కోట్లు కేవలం అరు మంది రైస్ మిల్లర్ల దగ్గర బకాయిలుగా ఉన్నాయి. ఇప్పటికే బకాయిలు ఉన్న మిల్లర్లుకు నోటిసులు ఇచ్చామని , వెంటనే రబీ 2022-23 రబీకి సంబంధించిన బకాయిలను అక్టోబర్ 31 వరకు చెల్లించాలని, బకాయిలు చెల్లించపోతే చర్యలు తీసుకుంటమని పౌరసంబంధాల శాఖ అధికారులు చెబుతున్నారు.
మిల్లర్ల డిమాండ్లు
మరోవైపు తమ సమస్యలను పరిష్కరించాలని మెదక్ జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని కోరుతోంది. మిల్లింగ్ చార్జీలను తక్షణమే పెంచాలని, ప్రస్తుతం ఉన్న Out-Turn Ratio (OTR) ను నాటి పరిస్థితులకు అనుగుణంగా సవరించాలని డిమాండ్ చేశారు. ధాన్యం మిల్లింగ్లో Sortex యంత్రాల వినియోగం వల్ల ఏర్పడే 15 నుండి 20 శాతం వరకు స్టోరేజీ నష్టాన్ని అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. కొందరు మిల్లర్లు చేసిన తప్పులను ఆసరాగా చేసుకుని మొత్తం రైస్ మిల్లింగ్ వ్యవస్థనే అనుమానాస్పదంగా చూడటం తగదని, తమ ఆర్థిక భారాలను తగ్గించేలా ప్రభుత్వం నిబంధనలు సడలించాలని కోరుతున్నారు.

