కలం, జోగులాంబ గద్వాల: ప్రేమ పెళ్లిని (Love Marriage Dispute) అంగీకరించని యువతి కుటుంబ సభ్యులు ప్రియుడి ఇంటిపై దాడి చేశారు. జేసీబీతో ఇంటిని నేలమట్టం చేశారు. ఈ ఘటన గురువారం గద్వాల మండలం రేపల్లె గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలోకి వెళ్లితే గద్వాల మండలం రేపల్లె గ్రామానికి చెందిన రంగముని, అదే గ్రామానికి చెందిన మహేశ్వరి ఇద్దరు ప్రేమించుకున్నారు. ఇటీవల కుటుంబ సభ్యులకు చెప్పకుండా హైదరాబాద్లో వారు ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లి విషయం గురువారం గద్వాల మండలం రేపల్లి గ్రామంలో నివసిస్తున్న మహేశ్వరీ కుటుంబ సభ్యులకు తెలియడంతో ఆగ్రహానికి గురయ్యారు.
గురువారం రంగముని ఇంటిని జేసీబీతో పూర్తిగా కూల్చివేసి ధ్వంసం చేశారు. ఈ దాడితో బెంబేలెత్తిపోయిన బాధిత కుటుంబ సభ్యులు గద్వాల పోలీసులను ఆశ్రయించారు. రంగముని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటన అనంతరం గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా, ఉద్రిక్తతలు తలెత్తకుండా గద్వాల సీఐ టి.శ్రీను, ఎస్ఐ శ్రీకాంత్, కళ్యాణ్ కుమార్, పోలీసులు గస్తీ ఏర్పాటు చేశారు. ఇది ఇలా ఉండగా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన రంగమునితో, బీసి సామాజిక వర్గానికి చెందిన మహేశ్వరీ ని కులాంతర వివాహం చేసుకున్నాడనే కారణంతోనే యువకుడి ఇల్లుము ధ్వంసం చేశారని గ్రామస్తులు ఆరోపించారు.

