కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్లోని మైత్రివనం భవనంలో శుక్రవారం భారీ అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. మైత్రివనంలోని నీలగిరి బ్లాక్ భవనంలో మంటలు చెలరేగి పొగ కమ్ముకున్నది. పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది రంగంలోకి దిగి బాధితులను కాపాడారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. అయితే ఈ ఘటనను పరిశీలించేందుకు హైడ్రా కమిషనర్ (Hydra Commissioner) రంగనాథ్ అక్కడికి చేరుకొని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేబుల్ షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని రంగనాథ్ వెల్లడించారు.
బాల్కనీలో చెత్త డంప్ చేయడం వల్ల రెస్క్యూ ఇబ్బందికరంగా మారిందని రంగనాథ్ (Hydra Commissioner) వివరించారు. మంటలు ఇతర అంతస్తులకు వ్యాపించలేదని చెప్పారు. ‘ఒకవేళ మంటలు చెలరేగి ఉంటే పరిస్థితి చాలా భయంకరంగా ఉండేది’ అని అన్నారు. వచ్చే నెల నుండి ఫైర్ సేఫ్టీ నిబంధనలను కచ్చితంగా పర్యవేక్షిస్తామని చెప్పారు. ఇటీవల హైదరాబాద్ లో వరస అగ్ని ప్రమాదాలు జరుగుతున్న విషయం తెలిసిందే. అధికారులు ఫైర్ సెఫ్టీ నిబంధనలకు సంబంధించి తనిఖీలు చేయడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.


