కలం, మహబూబ్నగర్ బ్యూరో: జిల్లా ఎస్పీ డి. జానకి ఆదేశాల మేరకు మహబూబ్నగర్ (Mahabubnagar) ట్రాఫిక్ పోలీసులు (Traffic Police) శుక్రవారం ఆర్టీసీ బస్ డిపోలో ఆర్టీసీ డ్రైవర్లకు రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సిబ్బంది డ్రంక్ అండ్ డ్రైవ్, వాహనం నడుపుతూ సెల్ఫోన్ వినియోగం, అతివేగం వంటి ప్రమాదకర చర్యల వల్ల సంభవించే ప్రమాదాలపై డ్రైవర్లకు వివరించారు. వాహనాలను నడిపే సమయంలో తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, నిర్ణీత వేగ పరిమితిలోనే ప్రయాణించాలని, డ్రైవింగ్ సమయంలో సెల్ఫోన్ వినియోగాన్ని పూర్తిగా నివారించాలని సూచించారు.
ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, అప్రమత్తంగా, బాధ్యతాయుతంగా వాహనాలను నడపాలని ఆర్టీసీ డ్రైవర్లకు సూచించారు. రోడ్డు భద్రతా నిబంధనలను కచ్చితంగా పాటించడం ద్వారా ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని ట్రాఫిక్ పోలీసులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ అంజిలయ్య, పోలీస్ కానిస్టేబుల్ ఎల్. రమేష్ పాల్గొని డ్రైవర్లకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మొత్తం 55 మంది ఆర్టీసీ బస్ డ్రైవర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ పోలీసులు ప్రజలకు, డ్రైవర్లకు “ట్రాఫిక్ నిబంధనలు పాటిద్దాం – ప్రమాదాలను నివారిద్దాం – సురక్షిత ప్రయాణాన్ని కొనసాగిద్దాం” అంటూ పిలుపునిచ్చారు.

