కలం, మహబూబ్ నగర్ బ్యూరో: పర్యావరణ పరిరక్షణ నిమిత్తం మట్టి వినాయక ప్రతిమలను పూజించాలని లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320 ఎఫాస్ట్ పీడీజే లయన్ డాక్టర్ అంబటి నటరాజ్ అన్నారు. పాలమూరు లయన్స్ క్లబ్ (Lions Club Mahabubnagar) ఆధ్వర్యంలో శనివారం తెలంగాణ చౌరస్తాలో మట్టి వినాయక ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లయన్ నటరాజ్ మాట్లాడుతూ.. పీఓపీ విగ్రహాలు కరిగేందుకు సుదీర్ఘ సమయం పడుతుందని, మట్టి విగ్రహాలు సులువుగా కరుగుతాయని అన్నారు.
ప్రజల్లో అవగాహన పెంచడమే లక్ష్యం
చెరువుల్లో జలచరాలను, పర్యావరణాన్ని కాపాడేందుకు మట్టి వినాయకులని పూజించాలని కోరారు. మట్టి విగ్రహాల వినియోగంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకే ఉచితంగా ప్రతిమలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు లయన్ జి. రమణయ్య, లయన్ అశ్విని చంద్రశేఖర్, సీనియర్ జర్నలిస్ట్ MV. రమణ, అంజయ్య, పరుశురాం తదితరులు పాల్గొన్నారు.

