కలం వెబ్ డెస్క్: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) దేశంలోని మహిళలకు తీపి కబురు అందించారు. కేంద్ర బడ్జెట్లో (Union Budget) మహిళల కోసం కీలక నిర్ణయాలు తీసుకున్నారు. “లఖ్పతి దీదీ యోజన” (Lakhpati Didi Yojana) పథకాన్ని కేంద్రం 2026 బడ్జెట్లో అప్గ్రేడ్ చేసింది. మహిళలు స్వశక్తితో ఆర్థికంగా ఎదగాలన్న ఉద్దేశంతో స్వయం సహాయక సంఘాల మహిళల కోసం కేంద్రం ఈ పథకాన్ని ప్రవేశ పెట్టింది. దీని ద్వారా మహిళలకు వడ్డీ లేని రుణాలు అందిస్తూ, నైపుణ్య శిక్షణ అందించి ఏటా రూ.లక్ష వరకు సంపాదించుకునేలా సాయం చేస్తారు. ప్రభుత్వం చేపట్టిన ఈ మహిళా స్వశక్తీకరణ కార్యక్రమం ఇప్పుడు కొత్తగా రూపుదిద్దుకోనుంది.
మహిళా వ్యాపారులకు మద్దతు ఇవ్వడానికి కమ్యూనిటీ ఓన్డ్ షీ మార్ట్లను విస్తరించే ప్రణాళికను ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ మార్పులు గ్రామీణ మహిళలకు ఆర్థిక అవకాశాలను పెంచుతాయని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఈ పథకంలో ప్రధాన పాత్ర పోషించే స్వయం సహాయక సంఘాలను కూడా బలపరుస్తుందని చెప్పారు.
మరోవైపు చిన్న, సన్నకారు రైతుల ఆదాయం పెంచేందుకు, దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. 500 రిజర్వాయర్లలో చేపల పెంపకం, అభివృద్ధి పనులకు చర్యలు చేపట్టనుంది. పశు సంవర్ధక శాఖలో భారీగా ప్రోత్సాహకాలు ప్రకటించింది. వ్యవసాయ ఆదాయం పెంచేందుకు అధిక విలువ గల పంటలకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందించనుంది. తీర ప్రాంతాల్లో కొబ్బరి, గంధం చెట్లు పెంచే రైతులను ప్రోత్సహించనుంది. కొబ్బరి ఉత్పత్తి పెంపునకు ప్రత్యేక ప్రోత్సాహక పథకం అమలు చేయనుంది.
కాయలు కాయని చెట్ల స్థానంలో కొత్త చెట్లు నాటేందుకు కూడా ప్రోత్సాహకాలు ఇవ్వనుంది. మెడికల్ టూరిజానికి బడ్జెట్లో (Union Budget) భారీగా నిధులు కేటాయించారు. ప్రైవేట్ రంగంతో కలిసి ఐదు రీజినల్ మెడికల్ హబ్ల ఏర్పాటుకు నిర్ణయించారు. మెడికల్ హబ్ల ద్వారా యువతకు ఉద్యోగాలు లభిస్తాయని నిర్మలా సీతారామన్ తెలిపారు. దేశవ్యాప్తంగా మూడు ఆల్ ఇండియా ఆయుర్వేద కాలేజీల ఏర్పాటు చేయనున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
Read Also: చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు భారీ ఊతం
Follow Us On: Pinterest


