కలం, వెబ్ డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) వార్నింగ్ ఇచ్చారు. వచ్చే ఐదేళ్లు చిట్టి నాయుడికి సినిమా చూపించే బాధ్యత తనదని రేవంత్ రెడ్డిపై కేటీఆర్ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. వర్ధన్నపేట పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ కార్యకర్తలను వేధించిన వారిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. ‘నేను కేసీఆర్ అంత మంచోడిని కాదు. వచ్చే ఐదేళ్లు చిట్టి నాయుడు, ఆయన బృందానికి రాజకీయంగా సమాధానం చెబుతా’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
పార్టీ కార్యకర్తలను ఇబ్బందులు, కేసులు పెట్టిన వాళ్లను, తమతో నిలబడిన వాళ్లను ఎప్పటికీ మర్చిపోమని చెప్పారు. కార్యకర్తలను ఇబ్బంది పెట్టి, తప్పుడు కేసులు పెట్టిన ఎవ్వరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని.. సప్త సముద్రాల అవతల దాక్కున్నా ప్రతీ ఒక్కరినీ ఏరికోరి తెచ్చి చట్టం ముందు నిలబెడతానని ఆయన తేల్చిచెప్పారు. కార్యకర్తల వెంటే పార్టీ ఉంటుందని కేటీఆర్ భరోసా ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ‘కాంగ్రెస్ పోవాలి.. కేసీఆర్ రావాలి’ అనే నినాదం మార్మోగుతుంది అని ఆయన చెప్పుకొచ్చారు. 2028 లో ముఖ్యమంత్రిగా కేసీఆర్ కావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు.

