కలం, వెబ్ డెస్క్: మంత్రి కొండా సురేఖ (Konda Surekha) కూతురు సుస్మితా పటేల్ (Susmita Patel) తన పొలిటికల్ కెరీర్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పరకాల నియోజకవర్గం గీసుకొండ మండలం కొమ్మాల లక్ష్మీనరసింహస్వామి జాతరకు సుస్మితా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తన తల్లిదండ్రుల రాజకీయ ప్రస్థానం కొమ్మాల జాతర నుంచే మొదలైందని చెప్పారు. ఇక తన రాజకీయ ప్రస్థానం కూడా ఇక్కడి నుంచే ప్రారంభమవుతున్నట్లు వెల్లడించారు. తాను తప్పకుండా పరకాల ఎమ్మెల్యేగా గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలకు సేవ చేసుకుంటానని చెప్పారు. ఈ నేపథ్యంలో సుస్మితా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమని చర్చ నడుస్తోంది. కొమ్మాల నుంచే రాజకీయ ప్రస్థానం మొదలవుతుందని ప్రకటించడంతో ఆమె పరకాల నియోజకవర్గం నుంచే పోటీ చేయనుందని తెలుస్తోంది.

