కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం–దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవేపై (Khammam-Devarapalli Greenfield Highway) గురువారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) ఒకే కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని దంసలాపురం సమీపంలోని మున్నేరు వంతెన వద్ద కారు, డీసీఎం ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో తల్లీకొడుకు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో చింతకాని మండలం గాంధీనగర్ గ్రామానికి చెందిన పాపబత్తిని సుజాత (38), ఆమె కుమారుడు పాపబత్తిని పవన్ కుమార్ (17) ప్రాణాలు కోల్పోయారు. ఢీకొన్న తీవ్రతకు కారు పూర్తిగా ధ్వంసమై, మృతదేహాలు వాహన శిథిలాలలో చిక్కుకుపోయాయి.
అదే కారులో ప్రయాణిస్తున్న మరో వ్యక్తితో పాటు డీసీఎం డ్రైవర్ కూడా తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్రేన్ సాయంతో కారును తొలగించి మృతదేహాలను బయటకు తీశారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఒకే కుటుంబానికి చెందిన తల్లీకొడుకులు మృతి చెందడంతో గాంధీనగర్ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

