కలం, వెబ్ డెస్క్ : గుండె పోటుకు గురై సికింద్రబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పరామర్శించారు. ఈ సందర్భంగా పెద్ది ఆరోగ్య పరిస్థితులపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అలాగే, ఆయన కుటుంబ సభ్యులను కలిసి మాట్లాడారు. కేసీఆర్ వెంట మాజీ మంత్రులు హరీశ్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ తో పాటు పలువురు నేతలు ఉన్నారు.
కాగా, ఆదివారం హన్మకొండలో తన నివాసంలో ఉన్న సమయంలో పెద్ది సుదర్శన్ రెడ్డికి గుండెపోటు వచ్చింది. దీంతో ఆయన్ను కుటుంబ సభ్యులు రోహిణి ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో హుటాహుటిన ఆయన్ను గ్రీన్ ఛానల్ ద్వారా యశోద ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

