కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అక్రమ ఇసుక తవ్వకాలు, రవాణా, నిల్వలపై పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం ఆదేశాల మేరకు టాస్క్ఫోర్స్ పోలీసులు మానకొండూరు (Manakondur) మండలంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. వెల్ది గ్రామ పరిధిలో అక్రమంగా నిల్వ ఉంచిన ఆరు భారీ ఇసుక డంప్లు గుర్తించి సీజ్ చేశారు. ఇక్కడ 56 ట్రాక్టర్ల లోడుల ఇసుక ఉన్నట్లు గుర్తించారు. అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. ఇసుక నిల్వలు, ట్రాక్టర్లను చర్యల నిమిత్తం మానకొండూరు పోలీస్ స్టేషన్కు అప్పగించారు. సీపీ గౌష్ ఆలం మాట్లాడుతూ.. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను అక్రమంగా తవ్వడం, నిల్వ చేయడం, రవాణా చేయడం వంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు. అక్రమ ఇసుక రవాణాపై జిల్లా వ్యాప్తంగా నిరంతర నిఘా కొనసాగుతుందన్నారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై మైనింగ్ చట్టాలు, ఇతర సంబంధిత చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

