కలం, వెబ్ డెస్క్ : ఉత్తరాఖండ్ నుంచి వచ్చి తప్పిపోయిన మహిళకు కరీంనగర్ పోలీసులు (Karimnagar Police) భరోసాగా నిలిచారు. సోమవారం రాత్రి కరీంనగర్ రూరల్ మండలంలోని ఇరుకుల గ్రామ శివారులో రాజీవ్ రహదారి పక్కన నూతనంగా నిర్మిస్తున్న వంతెన సమీపంలో ఓ గుర్తుతెలియని మహిళ ఒంటరిగా నిలబడి ఉన్నట్లు కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ నిరంజన్ రెడ్డికి ఫోన్ ద్వారా సమాచారం అందింది.
వెంటనే స్పందించిన పోలీసులు మహిళల వద్దకు వెళ్లి వాకాబు చేయగా వివరాల ప్రకారం.. ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన రూపా రాథోర్ (35) అనే మహిళ కుటుంబ కలహాలతో వారం క్రితం వివిధ వాహనాల్లో ప్రయానిస్తూ కరీంనగర్ చేరుకుంది. అనంతరం కరీంగనర్ బస్టాండ్ లో బస్సు ఎక్కడగా టికెట్ కు డబ్బులు లేకపోవడంతో బస్సు సిబ్బంది మహిళను కిందకు దించేశారు.
ఈ క్రమంలో మహిళ దగ్గరకు వెళ్లిన పోలీసులు ఆమె తెలిపిన వివరాల ఆధారంగా కుటుంబ సభ్యులను కరీంనగర్ రూరల్ పోలీసులు ఫోన్ ద్వారా సంప్రదించారు. గత వారం రోజులుగా ఆమె కనిపించకపోవడంతో ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని సంబంధిత పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు వారు తెలిపారు. తాము కరీంనగర్కు వచ్చి ఆమెను తీసుకెళ్తామని కూడా పోలీసులకు తెలియజేశారు.
మహిళ భద్రతను దృష్టిలో ఉంచుకొని ఆమెను కరీంనగర్కు తరలించి శక్తి కేంద్రంలో సురక్షితంగా ఉంచారు. మహిళ కుటుంబ సభ్యులు లేదా ఉత్తరాఖండ్ పోలీసులు వచ్చిన అనంతరం అవసరమైన చట్టపరమైన ప్రక్రియ పూర్తి చేసి వారికి అప్పగించనున్నట్లు కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ నిరంజన్ రెడ్డి తెలిపారు.

