కలం, కరీంనగర్: కరీంనగర్ జిల్లా దేశ్ రాజ్ పల్లి గ్రామంలో 13-03-2023న జరిగిన మహిళ హత్య కేసు (Karimnagar Murder Case)లో జిల్లా కోర్టు కీలక తీర్పు వెల్లడించింది. A1కు జీవిత ఖైదు విధించగా.. నిందితుడు A2 నిర్దోషిగా విడుదల చేసింది. మామిడిపల్లి అనిత (50) హత్య కేసులో నిందితుడు A1 తాడగొండ దామోదర్ (34)కు (తండ్రి: నర్సింగ్, తిరుమలాపూర్, రామడుగు మండలం ప్రస్తుతం కిసాన్నగర్) కరీంనగర్ కోర్టు జీవిత ఖైదు, రూ.3,000 జరిమానా విధించింది. ఈ కేసులో A2 జాంబోజి శివ కుమార్ (23)ను (తండ్రి: శ్రీనివాస్, దుర్శేడ్ గ్రామం, కరీంనగర్ రూరల్ మండలం) కోర్టు నిర్దోషిగా ప్రకటించింది.
ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం, మృతురాలు పగటి సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉంటుందనే విషయాన్ని తెలుసుకున్న A1 తాడగొండ దామోదర్, తనకు మరియు A2 జాంబోజి శివ కుమార్కు డబ్బు అవసరం ఉండటంతో మృతురాలి వద్ద రూ.30,000/- అప్పుగా ఇవ్వాలని కోరాడు. ఆమె డబ్బు ఇవ్వడానికి నిరాకరించడంతో, ఆమెను హత్య చేసి బంగారు ఆభరణాలు దోచుకోవాలని నిందితులు పథకం రూపొందించినట్లు కేసు దర్యాప్తులో వెల్లడైంది. 13-03-2023న మృతురాలి ఇంటికి వెళ్లిన A1 తాడగొండ దామోదర్, A2 జాంబోజి శివ కుమార్లు ఆమెను హత్య చేసి, ఆమె వద్ద ఉన్న బంగారు ఆభరణాలు, ఇతర వస్తువులను తీసుకుని అక్కడి నుంచి పరారైనట్లు ప్రాసిక్యూషన్ కోర్టుకు వివరించింది.
ఈ కేసులో నేరాన్ని నిరూపించేందుకు పోలీసుల తరఫున సమర్థవంతమైన దర్యాప్తు, ఆధారాల సేకరణ చేపట్టారు. కోర్టులో ప్రాసిక్యూషన్ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ మల్యాల ప్రతాప్ వాదనలు వినిపించారు. దర్యాప్తు మరియు సీసీఆర్బి ఏసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కోర్టు ప్రక్రియలో కోర్టు డ్యూటీ అధికారి శ్రీధర్ (రామడుగు), ASI సత్తయ్య, CMS తదితరులు సమన్వయంతో విధులు నిర్వహించారు.
కేసును విచారించిన పిడీజే కోర్టు న్యాయమూర్తి ఎస్. శివకుమార్ తీర్పు వెలువరించారు. A1 తాడగొండ దామోదర్కు జీవిత ఖైదుతో పాటు రూ.3,000/- జరిమానా విధించగా, A2 జాంబోజి శివ కుమార్ను నిర్దోషిగా విడుదల చేశారు. నేర నిరూపణలో సమర్థవంతమైన దర్యాప్తు, పకడ్బందీ ఆధారాల సేకరణకు కృషి చేసిన పోలీసు అధికారులు, సిబ్బంది ప్రాసిక్యూషన్ బృందాన్ని పోలీస్ కమీషనర్ గౌష్ ఆలం అభినందించారు.

