కలం, కరీంనగర్ బ్యూరో: ప్రజలకు పోలీసు సేవలను మరింత చేరువ చేయడంతో పాటు పర్యావరణ పరిరక్షణ, ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు పోలీసుల ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కరీంనగర్ పోలీస్ కమిషనర్ (Karimnagar CP) గౌష్ ఆలం (Gaush Alam) తెలిపారు.
వీణవంక (Veenavanka) మండలం కోర్కల్ గ్రామంలో పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన వనమహోత్సవం, ఉచిత కంటి వైద్య శిబిరం, వీణవంక పోలీస్ స్టేషన్లో చిల్డ్రన్ పార్కు ప్రారంభోత్సవం కార్యక్రమాల్లో సీపీ గౌష్ ఆలం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వనమహోత్సవంలో భాగంగా మొక్కలు నాటి, పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు.
స్థానిక ప్రజల కోసం ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సీపీ ప్రారంభించి, ప్రజలకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు. పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన చిల్డ్రన్ పార్కును ప్రారంభించారు. పోలీస్ స్టేషన్కు వచ్చే పిల్లలు, ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు ఇటువంటి సౌకర్యాలు ఉపయోగపడతాయని తెలిపారు.
గణేష్ మండపాల వద్ద భద్రతా చర్యలు
అనంతరం కోర్కల్ గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల్లోని పలు గణేష్ మండపాలను సీపీ సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. మండపాల వద్ద విద్యుత్, ఫైర్ సేఫ్టీ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని నిర్వాహకులకు సూచించారు. నిమజ్జనం సందర్భంగా భక్తులు అప్రమత్తంగా ఉండాలని, పోలీసుల సూచనలు పాటిస్తూ ప్రశాంతంగా ఉత్సవాలను నిర్వహించాలని తెలిపారు.
నిమజ్జన ప్రాంతాల్లో ప్రమాదాల నివారణకు అవసరమైన భద్రతా చర్యలు చేపట్టాలని, ట్రాఫిక్ నియంత్రణ, విద్యుత్ భద్రత, బారికేడింగ్ తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని పోలీసు అధికారులకు సూచించారు. గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా నిర్వాహకులు, ప్రజలు పోలీసులకు సహకరించాలని సీపీ కోరారు.
కార్యక్రమంలో ఏసీపీ మాధవి, జమ్మికుంట రూరల్ ఇన్స్పెక్టర్ వెంకటి, వీణవంక ఎస్సై ఆవుల తిరుపతి, ఇతర పోలీసు అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పోలీసు సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

