కలం, నిజామాబాద్ బ్యూరో : రాఖీ పండుగ రోజు కామారెడ్డి (Kamareddy) లో వాహనదారులకు ఊహించని అనుభవం ఎదురైంది. హెల్మెట్ లేకుండా వచ్చినందుకు చలానా రాస్తారనుకుంటే.. మహిళా కానిస్టేబుల్ ఎదురొచ్చి బొట్టు పెట్టి రాఖీ కట్టింది. “అన్నా.. హెల్మెట్ పెట్టుకో, నీ కుటుంబం నీ కోసం చూస్తోంది” అనే ఒక్క మాటతో అక్కడే వాహనదారుల మనసు మారిపోయింది. శుక్రవారం కామారెడ్డి పోలీస్ స్టేషన్ ఎదుట జిల్లా ఎస్పీ ఎం.రాజేష్ చంద్ర ఆలోచనతో ఈ కార్యక్రమం జరిగింది.
డీఎస్పీ ఆదేశాల మేరకు పట్టణ సీఐ నరహరి, ట్రాఫిక్ ఎస్ఐ చంద్రశేఖర్ గౌడ్, వినయ్ సాగర్ ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. సాధారణంగా లాఠీ, చలానా బుక్ తో కనిపించే పోలీసులు.. రాఖీలు, కుంకుమతో కనిపించడంతో వాహనదారులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. రాఖీలు కట్టిన ట్రాఫిక్ మహిళా పోలీసులు హెల్మెట్ పెట్టుకోండి అన్న అంటూ ఆప్యాయంగా మాట్లాడారు.. దీంతో చాలామంది ‘అక్కా.. చెల్లె ఇక నుండి తప్పకుండా హెల్మెట్ పెడతా’ అని మాట ఇచ్చి వెళ్ళారు.

