కలం, వెబ్ డెస్క్: తెలంగాణ ఎక్సైజ్ శాఖలో మహిళల భాగస్వామ్యం పెరగడం మహిళా సాధికారతకు నిదర్శనమని మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) అన్నారు. పోలీస్ యూనిఫాం హోదాకు కాదని.. ప్రజల విశ్వాసానికి ప్రతీక అని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ బండ్లగూడ జాగీర్లోని ఎక్సైజ్ అకాడమీలో గురువారం నిర్వహించిన అసిస్టెంట్ సూపరింటెండెంట్స్, ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ల దీక్షాంత్ పరేడ్ (పాసింగ్ అవుట్ పరేడ్) కార్యక్రమానికి మంత్రి హాజరై మహిళా పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆరు నెలల శిక్షణ పూర్తి చేసుకున్న 117 మంది అధికారులను అభినందించారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విజేతలకు పురస్కారాలు అందజేసి మాట్లాడారు.
ఎక్సైజ్ శాఖ కేవలం ఆదాయ శాఖ కాదని.. ప్రజారోగ్య పరిరక్షణలో కీలక విభాగమని మంత్రి స్పష్టం చేశారు. మొత్తం 117 మందిలో 33 మంది మహిళా అధికారులు ఉన్నారని తెలిపారు. 24 మంది అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్లు, 89 మంది సబ్ ఇన్స్పెక్టర్లకు శిక్షణ అందించామని చెప్పారు. శిక్షణతో చట్టాలపై అవగాహన, విచారణా నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలు పెంపొందాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అసలు పరీక్ష క్షేత్రస్థాయిలో విధుల నిర్వహణలోనే మొదలవుతుందన్నారు. డ్రగ్స్, గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపి యువతను పరిరక్షించాల్సిన భాద్యత పోలీస్ అధికారులపై ఉందని అన్నారు.
తెలంగాణలోకి మాదకద్రవ్యాలు ప్రవేశించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు. గంజాయి, మద్యం అక్రమ రవాణా ముఠాలపై కఠిన చర్యలు ఉంటాయని.. అక్రమార్కులు ఎంతటివారైనా వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. నాడు నాటుసారా, గుడుంబా, కల్తీ కల్లు, సింథటిక్ డ్రగ్స్, మాదకద్రవ్యాల నెట్వర్క్లు కొత్త ముప్పుగా మారాయని అన్నారు. దీనిపై ప్రత్యేక నిఘా అవసరమని.. మారుతున్న నేర ధోరణులకు అనుగుణంగా అధికారులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

