కలం డెస్క్ : పోస్టు గ్రాడ్యుయేట్ మెడికో డాక్టర్ నస్రత్ పర్వీన్ (Dr. Nusrat Parveen)కు ఉద్యోగమిస్తామంటూ జార్ఖండ్ సర్కార్ ఆఫర్ ప్రకటించింది. నెలకు రూ. 3 లక్షల వేతనాన్ని ఫిక్స్ చేస్తామని, నివాస అవసరాలకు ప్రభుత్వం తరఫున ఇంటిని కూడా సమకూరుస్తామని స్పష్టం చేసింది. డాక్టర్ నస్రత్కు జార్ఖండ్ ప్రభుత్వం ఇస్తున్నది కేవలం జాబ్ ఆఫర్ కాదని, ఆమె గౌరవానికి తగిన స్థానం అని ఆ రాష్ట్ర వైద్యారోగ్య మంత్రి డాక్టర్ ఇర్ఫాన్ అన్సారీ (Minister Irfan Ansari) తెలిపారు. బిహార్ రాష్ట్రానికి చెందిన ఆమెకు ఈ నెల 15న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ (Nitish Kumar) జాబ్ అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చారు. ఆ సమయంలో ఆమె హిజాబ్ను బలవంతంగా ఆయన తొలగించడం వివాదాస్పదమైంది. అప్పటి నుంచి ఆమె జాబ్లో చేరలేదు. నాలుగు రోజులుగా ఇంటికే పరిమితమయ్యారు. లెక్క ప్రకారం ఈ రోజు (డిసెంబరు 20) చేరాల్సి ఉన్నది. ఇంతలోనే జార్ఖండ్ వైద్యారోగ్య శాఖ మంత్రి డాక్టర్ ఇర్ఫాన్ అన్సారీ ట్విట్టర్ (ఎక్స్) వేదికగా జాబ్ ఆఫర్ ప్రకటించారు.
హిజాబ్ తొలగించడంతో డిప్రెషన్లోకి :
డాక్టర్ కోర్సులో చేరకముందు నుంచే హిజాబ్ ధరించే నస్రత్(Dr Nusrat Parveen) దాదాపు ఏడేండ్లుగా ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఉన్నారని ఆమె చదువుతున్న పాట్నాలోని టిబ్బి మెడికల్ కాలేజీ టీచర్లు గుర్తుచేశారు. చదువులో ఆమె చాలా బ్రిలియంట్ స్టూడెంట్ అని పొగిడారు. ప్రిన్సిపాల్ డాక్టర్ మొహమ్మద్ ముఫజర్ రహమాన్ మాట్లాడుతూ, సహచర విద్యార్థిని బిల్కిస్తో నస్రత్ తన బాధను పంచుకున్నారని, బిహార్లోనే ఉద్యోగంలో చేరాలనే అభిప్రాయాన్ని వెల్లడించినట్లు తెలిపారు. హిజాబ్ను ముఖ్యమంత్రి నితీష్ కుమార్ బలవంతంగా తొలగించినప్పటి నుంచి నస్రత్ కాలేజీకే రావడంలేదని గుర్తుచేశారు. బిహార్ ఇచ్చిన జాబ్ ఆఫర్పై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోని డాక్టర్ నస్రత్ పర్వీన్ జార్ఖండ్ ప్రభుత్వ ఆఫర్పై ఎలాంటి వైఖరి తీసుకుంటారనేది ఆసక్తికరం. జార్ఖండ్లో మహిళలకు భద్రత ఉంటుందని, గౌరవంగా చూసుకునే సంస్కృతి ఈ రాష్ట్రం ప్రత్యేకత అని ఆ రాష్ట్ర వైద్య మంత్రి పేర్కొనడం గమనార్హం.
Read Also: బీఎస్ఎఫ్లో అగ్నివీరుల కోటా 50 శాతానికి పెంపు!
Follow Us On: Sharechat


