కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ వైద్య విధాన పరిషత్ (సెకండరీ హెల్త్ సర్వీసెస్) కు తక్షణమే పూర్తి బాధ్యతలతో కమిషనర్ను నియమించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలోని పలు ప్రభుత్వ వైద్యశాలల్లో జేఏసీ (TVVP JAC) శుక్రవారం నిరసన ప్రదర్శనలు నిర్వహించింది. హైదరాబాద్లోని మలక్పేట ప్రభుత్వ వైద్యశాలతో పాటు వనపర్తి జిల్లా వీపనగండ్ల ప్రభుత్వ వైద్యశాల, తాండూరు జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో ఉదయం టీవీవీపీ జేఏసీ ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రధాన, ఏరియా ఆస్పత్రుల్లో నర్సింగ్ సిబ్బంది నిరసనలు చేశారు. నిరసన కార్యక్రమానికి ఒక రోజు ముందే ఉన్నతాధికారులకు డిమాండ్లకు సంబంధించిన మెమొరాండం సమర్పించారు.
వైద్య విధాన పరిషత్ పరిపాలన సక్రమంగా కొనసాగేందుకు పూర్తిస్థాయి బాధ్యతలు కలిగిన కమిషనర్ నియామకం అవసరమని నర్సింగ్ సిబ్బంది పేర్కొన్నారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది, ఉద్యోగులు తమ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. సెకండరీ హెల్త్ సర్వీసెస్ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. కమిషనర్ నియామకంపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.

