కలం, వెబ్ డెస్క్: పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా భారత కరెన్సీ రూపాయి(Indian Rupee) విలువ మునుపెన్నడూ లేనంత కనిష్ట స్థాయికి పడిపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అమెరికా – ఇజ్రాయెల్ – ఇరాన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం, ముడి చమురు సరఫరాలో నెలకొన్న అంతరాయం కారణంగా శుక్రవారం ట్రేడింగ్లో రూపాయి విలువ భారీగా పడిపోయింది. డాలరుతో రూపాయి మారకం విలువ 86 పైసలు క్షీణించి 93.75 వద్ద ఆల్టైమ్ కనిష్ఠానికి పతనమయ్యింది. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితి వల్ల విదేశీ పెట్టుబడిదారులు తమ నిధులను వెనక్కి తీసుకోవడం కూడా ఈ పతనానికి ఒక ప్రధాన కారణంగా నిలిచింది.
భారత రూపాయి విలువ (Indian Rupee) పడిపోవడం వల్ల భారత ఆర్థిక వ్యవస్థపై భారీ ప్రభావం చూపే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు, ముఖ్యంగా ముడి చమురు, ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు పెరగడం వల్ల ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉందని అంటున్నారు. రూపాయి విలువ తగ్గడం వల్ల రవాణా ఖర్చులు (డీజిల్ ధరలు) పెరుగుతాయని.. తద్వారా కూరగాయలు, పప్పుధాన్యాలు వంటి నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి, సామాన్యుడి బడ్జెట్పై ప్రభావం పడుతుందని పేర్కొంటున్నారు. ఇది ఇలానే కొనసాగితే భారత ఆర్థిక వ్యవస్థ దెబ్బతినే ఛాన్స్ ఉందని చెబుతున్నారు.

