కలం, వెబ్ డెస్క్ : తెలంగాణలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ( CM Revanth Reddy) హైదరాబాద్లోని గోల్కొండ కోటలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అంతకుమందు పరేడ్ గ్రౌండ్ లో అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. గోల్కొండ నుంచి రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి సీఎం ప్రసంగించారు.
సంక్షేమాన్ని ఆర్థిక కోణంలో చూడటం లేదని.. సంక్షేమ పథకాల అమలు కోసం అహర్నిశలు కష్టపడుతున్నామని చెప్పారు. కేవలం ఓట్ల కోసమో మొక్కుబడిగా హామీలు ఇవ్వడం లేదని తెలిపారు. ప్రభుత్వ అందించిన పథకాల ఫలితాలు కనిపిస్తున్నాయన్నారు. తలసరి ఆదాయంలో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నామని రేవంత్ రెడ్డి వివరించారు.
రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్నారు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి రైతుల కళ్లల్లో ఆనందం చూస్తామని తెలిపారు. దేశంలో తొలిసారిగా తెలంగాణలో కులగణన చేశామన్నారు. సినీ కార్మికుల కోసం త్వరలోనే కొత్త బోర్డు ఏర్పాటు చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు.
అలాగే, అసెంబ్లీ ప్రాంగణంలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించగా.. శాసనమండలిలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జెండా వందనం చేశారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయమైన గాంధీభవన్లో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ జాతీయ జెండాను ఎగురవేశారు.

