కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్ నగర శివార్లలో అక్రమ మైనింగ్ కేంద్రాలపై హైడ్రా (HYDRAA) అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. రంగారెడ్డి జిల్లాలోని ఆరు కీలక ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న క్వారీలు, మైనింగ్ యూనిట్లపై ఈ చర్యలు చేపట్టారు. గండిపేట మండలం పరిధిలోని వట్టినాగులపల్లి, గౌలిదొడ్డి ప్రాంతాలతో పాటు శంషాబాద్ మండలం కొత్వాల్గూడలో అనుమతులు లేని 6 స్టోన్ క్రషింగ్ యూనిట్లు (Illegal Stone Crushers), 12 ఆర్ఎంసీ ప్లాంట్లను కూల్చివేశారు.
పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, మైనింగ్, రెవెన్యూ శాఖల ఫిర్యాదుల మేరకు ఈ భారీ ఆపరేషన్ నిర్వహించారు. ఈ అక్రమ యూనిట్ల వల్ల ప్రభుత్వ ఖజానాకు వందల కోట్ల రూపాయల గండి పడటమే కాకుండా.. భారీ శబ్దాలు, దుమ్ము కాలుష్యంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. హెచ్చరికలు జారీ చేసినా వెనక్కి తగ్గని బడా సంస్థల ప్లాంట్లను అధికారులు తొలగించారు. హైడ్రా తీసుకున్న ఈ నిర్ణయంతో కాలుష్య కోరల నుండి విముక్తి లభించడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

