కలం, హనుమకొండ: కాకతీయ పట్టణ అభివృద్ధి సంస్థ (KUDA) ఆధ్వర్యంలో హనుమకొండ (Hanumakonda) బాలసముద్రం ప్రాంతంలోని కమర్షియల్ ప్లాట్లు, అలాగే అంబేద్కర్ భవన్ సమీపంలోని రెసిడెన్షియల్ ఫ్లాట్లకు ఆదివారం నిర్వహించిన బహిరంగ వేలానికి (KUDA Auction) భారీ స్పందన లభించింది. గజం ధర రూ.97 వేలు వరకు పలకడంతో కుడాకు గణనీయమైన ఆదాయం సమకూరింది. కుడా వైస్ చైర్మన్, హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహాత్ బాజ్పాయి(Collector Chahat Bajpai) సమక్షంలో ఈ వేలం పాటను నిర్వహించారు. బాలసముద్రం ప్రాంతంలోని కమర్షియల్ ప్లాట్లకు కనీస గజం ధర రూ.50,000గా నిర్ణయించగా, వేలంలో పాల్గొన్న బిడ్డర్లు పోటాపోటీగా ధరలను పెంచారు.
ఫలితంగా గజానికి కనిష్టంగా రూ.66,000 నుంచి గరిష్టంగా రూ.97,000 వరకు ధరలు పలికాయి. మొత్తం ఎనిమిది కమర్షియల్ ప్లాట్లను వేలానికి ఉంచగా, వాటిలో ఆరు ప్లాట్లు విజయవంతంగా విక్రయమయ్యాయి. అదేవిధంగా అంబేద్కర్ భవన్ సమీపంలోని కుడా ఆధీనంలోని మూడు రెసిడెన్షియల్ ఫ్లాట్లను కూడా వేలానికి ఉంచగా, వాటిలో రెండు ఫ్లాట్లు బిడ్డర్లు కొనుగోలు చేశారు. చదరపు అడుగుకు రూ.4,200 చొప్పున ధరలు పలికాయి. వేలంలో విజయవంతంగా ఫ్లాట్లు కొనుగోలు చేసిన బిడ్డర్లకు కుడా వైస్ చైర్మన్, జిల్లా కలెక్టర్ చాహాత్ బాజ్పాయి అలాట్మెంట్ పత్రాలను అందజేశారు.

