కలం, మెదక్ బ్యూరో: మానసిక, ఆరోగ్య సమస్యలతో సతమతమయ్యే వారు యోగా (Yoga)తో చక్కటి పరిష్కార మార్గాలు పొందవచ్చని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి (Gudem Mahipal Reddy) అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో పటాన్చెరు మైత్రి మైదానంలో, పతాంజలి యోగా సమితి శిక్షకుల సౌజన్యంతో వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో వందలాది మంది విద్యార్థులు పాల్గొని యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఎవ్వరూ తమ ఆరోగ్యంపై దృష్టి పెట్టడం లేదన్నారు. దీంతో మానసిక, శారీరక సమస్యలతో నిరంతరం బాధపడుతూ అనారోగ్యకరమైన జీవితాలను కొనసాగిస్తున్నారని తెలిపారు. యోగా ప్రాముఖ్యతను తెలియజేయాలన్న లక్ష్యంతో గత రెండేళ్ల నుంచి యోగా డే నిర్వహిస్తున్నామన్నారు.
ఇక మత్తు వినియోగంపై మహిపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యార్థి దశ నుండే మత్తు పదార్థాల వినియోగం, వాటి దుష్ఫలితాలపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ప్రస్తుత సమాజంలో డ్రగ్స్ కల్చర్ ఎక్కువగా కొనసాగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి పౌరుడు తన బాధ్యతగా డ్రగ్స్కి వ్యతిరేకంగా పోరాటం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎక్కడైనా ఎవరైనా డ్రగ్స్ వినియోగిస్తే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

