కలం, వెబ్ డెస్క్: ఎంతో ప్రాముఖ్యత ఉన్న ఖైరతాబాద్ గణేష్ (Khairatabad Ganesh)కి గవర్నర్ శివప్రతాప్ శుక్లా దంపతులు తొలి పూజ నిర్వహించారు. 69 అడుగుల ఎత్తులో పంచముఖ సంకటహర మహాగణపతిగా భక్తులకు దర్శనం ఇస్తున్నాడు. గవర్నర్ దంపతులకు మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే దానం నాగేందర్ ఘన స్వాగతం పలికారు. అనంతరం, పూజారుల సమక్షంలో తొలి పూజ పూర్తి చేశారు. తెలంగాణ ప్రజలు సుభిక్షంగా ఉండాలని స్వామి వారిని ప్రార్థిస్తున్నట్లు గవర్నర్ తెలిపారు. తొలి పూజ పూర్తి కావడంతో గణనాథుడిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు.
పకడ్బందీగా ఏర్పాట్లు..
ఖైరతాబాద్ గణేషుడిని మంత్రి పొన్నం ప్రభాకర్ దర్శించుకుని మాట్లాడారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జీహెచ్ఎంసీ, పోలీస్, దేవాదాయ, విద్యుత్, వాటర్ వర్క్స్, వైద్య, ట్రాఫిక్ తదితర శాఖలను సమన్వయం చేసి ఏర్పాట్లు చేశామన్నారు. గత మూడేళ్లుగా గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని.. బోనాల ఉత్సవాలను కూడా ప్రభుత్వం ఎంతో ఘనంగా నిర్వహించిందన్నారు. ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమాలు సక్రమంగా సాగేందుకు భక్తులు, మండపాల నిర్వాహకులు పూర్తిగా సహకరించాలన్నారు..

