కలం, నిర్మల్: ప్రజల సమస్యలకు పరిష్కారం చూపాల్సిన ప్రభుత్వ కార్యాలయమే దుర్వాసనకు కేంద్రంగా మారింది. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయంలోని (Nirmal RDO Office) మరుగుదొడ్ల నుంచి వస్తున్న తీవ్ర దుర్గంధంతో ఇటు సిబ్బంది, అటు కార్యాలయానికి వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులను కలిసేందుకు వచ్చినవారు బాత్రూంల పరిస్థితి చూసి అసహనం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇదే భవనంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం కొనసాగిన సమయంలో మరుగుదొడ్లను క్రమం తప్పకుండా శుభ్రం చేయడం, నిర్వహణ చేపట్టేవారు.
అయితే కొత్త కలెక్టరేట్ భవనం ప్రారంభమైన తర్వాత ఈ భవనంలో ఆర్డీఓ కార్యాలయం ((Nirmal RDO Office)తో పాటు నిర్మల్ అర్బన్, నిర్మల్ రూరల్ తహసీల్దార్ కార్యాలయాలు కొనసాగుతున్నాయి. దీంతో ప్రతిరోజూ వందల సంఖ్యలో ప్రజలు వివిధ పనుల కోసం కార్యాలయానికి వస్తున్నారు. మరుగుదొడ్లలో పరిశుభ్రత, సరైన నిర్వహణ లేకపోవడంతో దుర్గంధం వెదజల్లుతోంది. కార్యాలయంలో గంటల తరబడి పనిచేసే ఉద్యోగులు ఈ దుర్వాసనతో ఇబ్బంది పడుతుండగా, ప్రజలు బాత్రూంలను ఉపయోగించేందుకు వెనుకంజ వేస్తున్నారు.
కొందరు బయటకు వెళ్లి అవసరాలు తీర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్వచ్ఛతపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యాలయాల్లోనే ఇలాంటి పరిస్థితులు నెలకొనడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని పలువురు అభిప్రాయపడుతున్నారు. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ఆర్డీఓ కార్యాలయంలో పరిశుభ్రమైన వాతావరణాన్ని కల్పించాలని కోరుతున్నారు.
Read Also: గుడిసెలు లేని రాష్ట్రంగా తెలంగాణ: నిర్మల్ కలెక్టర్ భవేశ్ మిశ్రా
Follow Us On: Sharechat

