కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం (Khammam) జిల్లాలో ఇటీవల నిర్వహించిన ప్రీ-ప్రైమరీ ఇన్స్ట్రక్టర్, ఆయా పోస్టుల నియామక ప్రక్రియలో తీవ్ర అక్రమాలు జరిగాయని, దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య (Sandra Venkata Veeraiah) డిమాండ్ చేశారు. ఖమ్మం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ కు గురువారం బీఆర్ఎస్ ప్రతినిధుల బృందంతో కలిసి ఆయన వినతిపత్రం సమర్పించారు. బాధిత అభ్యర్థులతో కలిసి కలెక్టర్ను కలిసిన సండ్ర వెంకట వీరయ్య, నియామకాలలో జరిగిన అక్రమాలపై ఆయనకు ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రీ-ప్రైమరీ పోస్టుల భర్తీలో అర్హులైన అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. నియామక ప్రక్రియలో అక్రమాలకు పాల్పడిన అధికారులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. మొత్తం భర్తీ ప్రక్రియపై సమగ్ర విచారణ జరిపించి, అర్హులైన అభ్యర్థులకే మొదటి ప్రాధాన్యత ఇస్తూ న్యాయం చేయాలని కోరారు.
బాధిత అభ్యర్థులకు ధైర్యం చెబుతూ, అన్యాయానికి గురైన ప్రతి ఒక్కరికీ బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అవసరమైతే ఈ నియామక అక్రమాలపై హైకోర్టును కూడా ఆశ్రయించి న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల, నగర పార్టీ అధ్యక్షులు బెల్లం వేణుగోపాల్, పగడాల నాగరాజు, బీఆర్ఎస్ నాయకులు, బాధిత అభ్యర్థులు పాల్గొన్నారు.

